శ్రీ శ్రీ శతజయంతి ఉత్సవాలు డిసెంబర్ 20, 2009 బెంగలూరు వయ్యలికావాలి లో జరిగింది(ఇప్పటికి రాయటానికి సమయం దొరికింది- సందర్భం కూడాను :) ). ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి వాళ్ళ సహకారంతో తెలుగు విజ్ఞాన సమితి వారు నిర్వహించారు. దీనిలో కాకరాల, తంగిరాల వెంటక సుబ్బారావు, అద్దేపల్లి రామమోహన రావు, అంపశయ్య నవీన్, ద్వానా శాస్త్రి, శివారెడ్డి, కొసరాజు, మృణాలిని మొదలైన పెద్దలు పాల్గొన్నారు. మొత్తం పద్దెనిమిది మంది వక్తలు శ్రీ శ్రీ రాసిన కవితలు , కథలు , నాటికలు , అనువాదాలు అన్నింటి పైన ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన సమయం పదినిమిషాలు మాత్రం. కాబట్టి ఆ సమయంలోనే విషయం పూర్తిగా చెప్పడానికి కుదరలేదు. ఇది కొంత అసంతృప్తి. కాని వీళ్ళ వ్యాసాలూ పుస్తక రూపం లో తీసుక వస్తాం అని సాహిత్య అకాడెమీ ప్రాంతీయ అధికారి మినలోచని అన్నారు.
తంగిరాల వెంకట సుబ్బారావు గారు మాట్లాడుతూ శ్రీ శ్రీ, తిలక్, శేషేంద్ర లను ఆధునిక కవిత్రయంగ అభివర్ణించారు.
కవి శివారెడ్డి గారు మరో ప్రస్థానం గురించి మాట్లాడారు. శ్రీ శ్రీ ని కాలమే సృష్టించిన కవిగా అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా ప్రొఫెసర్ సత్యం గారు మహా ప్రస్థానం గురించి ఆవేశంగా ప్రసంగిచారు. మార్క్సిజం ఒక జీవన విధానం అని అది మహాప్రస్థానం లో ఉంది అన్నారు.
మన్నవ భాస్కర్ గారు శ్రీ శ్రీ ని అక్షరాల లక్షాధికారి - మాటల కోటిస్వరుడుగా అభివర్ణించారు.
కొసరాజు గారు శ్రీ శ్రీ సినిమా పాటల గురించి మాట్లాడుతూ తెలుగువీర లేవరా పాట గురించి ప్రస్తావించారు. కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగిస్తే అది శ్రీ శ్రీ అని అన్నారు. ఆయన ప్రతి పాట ఎగిరే గాలిపటం అన్నారు.
కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారు శ్రీ శ్రీ అనంతం గూర్చి మాట్లాడుతూ ఇది ఆత్మచరిత్ర-చారిత్రాత్మక చరిత్ర గా అభివర్ణించారు. సర్రియలిజం చదవడం కాదు ఆచరణలో పెట్టారు శ్రీ శ్రీ అంటూ శ్రీ శ్రీ ని, చలాన్ని మనం చాలా వాటికి క్షమించాలి అన్నారు
ఇంకా అంపశయ్య నవీన్ గారు శ్రీ శ్రీ నవలలు-కథల పైన, మృణాలిని గారు రేడియో నాటికలపైన, ఆశాజ్యోతి గారు ప్రశ్నలు -జవాబులు పైన ప్రసంగించారు.
చివర్లో మర్కండపురం శ్రీనివాస రావు అనే ఆయన (ప్రభుత్వ అధికారి -బెంగలూరు లో ) కన్నడ లో ప్రసంగించారు. ఈయన గారు మహా ప్రస్థానాన్ని కన్నడం లో అనువాదించారట . ఈయన శ్రీ శ్రీ గురించి మాట్లాడటం కంటే తన గురించి చెప్పుకున్నదే ఎక్కువ. నాకు ఈయన ప్రసగిస్తున్నంత సేపు చిర్రెత్తి పోయింది.
శ్రీ శ్రీ కమ్యునిస్ట్ కవా?-కమ్యూనిజాన్ని నమ్మిన కవి.
శ్రీ శ్రీ కవిత్వం లక్షణం చెప్పారు కాని లక్ష్యం చెప్పలేదు.
శ్రీ శ్రీ వస్తు ప్రియుడా ? రూప ప్రియుడా ? మొదలైన ఎన్నో విషయాల పైన చర్చ జరిగింది.
4/30/2010 10:37:00 AM |
Category:
పుస్తకాలు-సాహిత్యం
|
3
comments